ఎండలు
మండిపోతున్నాయి, వడదెబ్బలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారని గుండెలు బాదుకుంటున్నాం
కాని ఇది పూర్తిగా మన స్వయంకృతం. మనం తీసుకుంటున్న గోతిలో మనమే పడుతున్నాం. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో పచ్చని ప్రకృతిని ఎవరి పరిదిలో వారు చెరబడుతుంటే
పాపం అది మాత్రం ఏంచేస్తుంది. పుడమితల్లిని కాపాడుకోవడంలో జనం చూపిస్తున్న
అలవిమాలిన నిర్లక్ష్యం మున్ముందు మరింత ఉదృతమై మానవాళిని వివిధ రూపాల్లో
ముంచెత్తబోతుందని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.
ప్లాస్టిక్
వినియోగాన్ని తగ్గించడని ఎంతమొత్తుకున్నా
బజారుకు వెళ్ళినప్పుడు కవర్ కొనడానికి మొగ్గుచూపుతాము తప్ప ప్రత్యామ్నాయాన్ని
ఎంతమాత్రం ప్రోత్సాహించం. కురుస్తున్న వర్షం వృధాకాకుండా ఒడిసిపట్టండి అని
పర్యావరణవేత్తలు తలబాదుకున్నా మన తలకెక్కదు సరికదా... మన ఇంట్లో ఇంకుడుగుంట
తవ్వేంత ఉడత సాయం కూడా మనం చెయ్యలేము. కొత్తగా ఇల్లు కడుతుంటే జానెడు నేలను
మిగిల్చి రెండు చెట్లు నాటి పచ్చదనానికి మనవంతు ప్రాణంపోయాలనే బుద్ది మనలో
ఎంతమందికి ఉంటుంది. ఇంధనాన్ని ఆదాచేసి భూతాపాన్ని తగ్గించాలనే కనీస బాధ్యత కూడా మనకు
గుర్తుకురాదు. ఒక పేపర్ ని వేస్ట్ చెయ్యడం లాంటి చిన్న చిన్న పనులద్వారా కూడా మనం
ప్రకృతిని తీరని అనర్ధం చేస్తున్నాం. చెప్పుకుంటూపోతే ఇలాంటివి కోకొల్లలు.
పక్కింటివాడి ఇల్లు తగలడుతుంటే మనకెందుకులే అని ఊరుకుంటే తర్వాత తగలబడేది మన
ఇల్లే. ఎండ తీవ్రతకు తాళలేక ఎవరో చనిపోయారని నేడు లెక్కలేసుకుంటున్నమనమే..రేపటి
చావుచిట్టాలో ఉండమని గ్యారంటీలేదు. నిజంగా ఇది ప్రకృతి మనకు చేస్తున్న ఒక ముందస్తు
హెచ్చరిక. ఇప్పటికైనా కళ్ళుతెరవకపోతే మున్ముందు మిగిలేది బూడిదే.
No comments:
Post a Comment